21, డిసెంబర్ 2016, బుధవారం

ఈమె పేరు ఆత్మ విశ్వా‌సం





నెలన్నర వయస్సులోనే పోలియో సోకడంతో ఆమె ఇక ఎప్పటికీ నడవలేదన్నారంతా. శాశ్వత అంగవైకల్యం సంక్రమించడంతో ఆమె భవిష్యత్‌ అంతా శూన్యమేనని ఆమె తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. అయినా సరే ఆత్మవిశ్వాసంతో అంగవైకల్యాన్ని ఓడించారు. ఉన్నత విద్యాసాధనతో, సామాజిక సేవలతో ఎంతోమంది ప్రశంసలందుకున్నారు. విదేశాలకు కూడా వెళ్లొచ్చారు. వికలాంగులకు అనేకరకాలుగా చేయూతనిస్తూ 'గ్లోబల్‌ ఎయిడ్‌' సంస్థ ద్వారా వారిలో మనోధైర్యాన్ని నింపుతున్నారు. తానుకదలలేని స్థితిలో ఉన్నా తనలాంటి ఎందరినో ముందుకు నడిపిస్తున్న ''సాయిపద్మ'' ''జీవన'' ప్రస్థానం... చదవండి.

విజయనగరం జిల్లా గజపతినగరంలో 1971లో బీఎస్‌ఆర్‌ మూర్తి, ఆదిశేషు దంపతులకు సాయిపద్మ జన్మించారు. ఆమె తల్లిదండ్రులిద్దరూ విశాఖ ఆంధ్ర మెడికల్‌ కాలేజీలో డాక్టర్లే. అందుకే కూతురు సాయిపద్మకు పోలియో సోకకుండా ముందు జాగ్రత్తతో వ్యాక్సిన్‌కూ తెచ్చి ఇంట్లో ఉంచారు. కానీ ఆమెకు నెలన్నరకే పోలియో సోకింది. అప్పటి ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం 90 రోజులు నిండిన వారికే ఈ వ్యాక్సిన్‌ వేయాలి. అందువల్ల అందుబాటులో వ్యాక్సిన్‌ ఉన్నా ఆమెకు వేయలేని స్థితి. ఇలా విశాఖ కేజీహెచ్‌లో తొలి పోలియో కేసు ఆమెదే. పోలియోతో ఆమె కాళ్లు, చేతులు పూర్తిగా చచ్చుబడిపోయాయి. ఇతర అవయవాలు, గొంతు కూడా దెబ్బతిన్నాయి.
52 సార్లు షాక్‌ ట్రీట్‌మెంట్లు ఇచ్చారు. ఎట్టకేలకు కాళ్లు తప్ప మిగిలిన అవయవాలు పనిచేయడం మొదలెట్టాయి. పన్నెండేళ్లు వచ్చేవరకు ఆమెను ఎత్తుకునే పెంచారు. అవయవాలు బలం పుంజుకోవడానికి ఒంటికి 'పులి'కొవ్వు రాసేవారు. బీచ్‌లో మెడ వరకు ఇసుకలో ఉంచేవారు. 1996లో ఆమె సీఏ-ఇంటర్‌ చేస్తున్న సమయంలో వెన్నెముక 'ఎస్‌' ఆకారంలో వంగిపోతే పక్కటెముకలను కట్‌ చేసి సరిచేశారు. అందుకోసం గ్రాస్‌ స్కోలియోసిస్‌ అనే పెద్ద ఆపరేషన్‌ను 18 గంటల పాటు చేశారు. అలా సాయిపద్మ శరీరానికి రకరకాల సందర్భాల్లో 18 సర్జరీలు జరిగాయి.

అత్యున్నత విద్యల్లో
తనువు మొండికేస్తున్నా మనసు ముందుకు నడిపిస్తుండడంతో ఆమె జ్ఞానతృష్ణకు ఆత్మ విశ్వాసమే ఆలంబనగా నిలిచింది. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి ఎం.కాం. చేసారు, న్యాయశాస్త్రంలో పట్ట భద్రురాలయ్యారు, సీఏ ఫైనల్‌ చేసారు, ఎంబీఏ చేస్తూ, కంప్యూటర్‌ అప్లికేషన్లలో, శాస్త్రీయ సంగీతంలో కూడా డిప్లొమా పొందారు.
రచయిత్రిగా, గాయనిగా
విశాఖపట్నంలోని ఎం.వి.పి.కాలనీలో నివాసం ఉంటున్న సాయిపద్మ మంచంపై ఎటూ కదలలేని స్థితిలో ఉన్నప్పుడు, ఆపరేషన్లు జరిగినప్పుడు రెండేళ్ల పాటు మంచంపైనే విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చేది. ఆ సమయంలో ఇంగ్లీష్‌లో 'లైఫ్‌' అనే కవితల పుస్తకాన్ని ఆమె రాశారు. తెలుగులో 15 కథలు, ట్రావెలాగ్‌, తమ్మిమొగ్గలు (కలువ మొగ్గలు) వంటి పుస్తకాలు రాశారు. ఎన్నో కవితలు కూడా రాసారు. సోషల్‌మీడియాలో కూడా ఆమె రచనలు చేస్తున్నారు. నార్త్‌ అమెరికా తెలుగు అసోసియేషన్‌ కథల పోటీల్లో ఆమె కథకు ప్రథమ బహుమతి వచ్చింది. 2007లో అమెరికాలో ఆమె పాడిన 'వైష్ణవజనతో' పాటకు ఏడు నిమిషాల్లో రూ.20 లక్షలు సమకూరింది. ఆ సొమ్ము అక్కడే ఒక సంస్థకు వికలాంగుల సర్జరీల కోసం ఇచ్చేశారు.

ఒకరికి ఒకరై
2006లో భర్త ప్రజ్ఞానంద్‌తో పరిచయం ఏర్పడింది. ప్రజ్ఞానంద్‌ చిన్నాన్న, సాయిపద్మ తండ్రి ఆంధ్ర మెడికల్‌ కళాశాలలో సహచరులని పరిచయాల ద్వారా తెలిసింది. అదే సమయంలో హిల్లరీ క్లింటన్‌ నిర్వహించిన రాజకీయ నిధి సమీకరణకు ఆమె వాలంటీర్‌గా ఎంపికయ్యారు. అతనిని కూడా అదే కార్యక్రమానికి ఎంపికచేసారు. వారిద్దరూ కలిసి అమెరికా వెళ్లారు. ఆ సమయంలో వారి స్నేహబంధం మరింత బలపడింది. వారిద్దరూ వివాహం చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. ఆనంద్‌ తల్లి కూడా అందుకు అంగీకరించడంతో వారి వివాహం 2008లో జరిగింది. మరణానంతరం తమ శరీరాలను దానమివ్వడానికి అంగీకారపత్రాన్ని రాసిచ్చి మరో ఆదర్శానికి అంకురార్పణ చేశారీ దంపతులు.

సమాజసేవలో
అన్నిరకాలుగా ఆసరా ఉన్న తన పరిస్థితే ఇలా ఉంటే ఆర్థికంగా, సామాజికంగా ఎలాంటి ఆసరా లేని వికలాంగుల పరిస్థితి ఏమిటనే ఆలోచన వచ్చింది. అందుకే అప్పట్లో వెలుగు ప్రాజెక్టు డెరైక్టర్‌గా ఉద్యోగం వచ్చినా ఆమె చేరలేదు. బీఎల్‌ చేసి న్యాయవాదిగా పనిచేస్తూ జూనియర్‌ సివిల్‌ జడ్జి ప్రిలిమ్స్‌ కూడా పరీక్ష పాసయ్యారు. రెండున్నర గంటల సమయం ఉండే ఫైనల్‌ ఎగ్జామ్‌ రాయడం శారీరకంగా ఆమెకు చాలా కష్టమైనపని. అందుకోసం స్క్రైబ్‌ను అడిగితే టెన్త్‌, ఇంటర్‌ వారినే ఇస్తామన్నారు. అందువల్ల తనకు న్యాయం జరగదని దీనిపై కోర్టులో న్యాయపోరాటం చేస్తున్నానని అమె చెప్పుకొచ్చారు.
ఉచిత న్యాయసహాయం
వికలాంగుల హక్కుల గురించి ఎవరూ మాట్లాడరు. మామూలు వారికంటే మాకే ఎక్కువ అవసరాలుంటాయి. మాలాంటి వారి కోసం ఉచితంగా కోర్టులో కేసులు వాదిస్తున్నానని సాయిపద్మ అన్నారు. వికలాంగులకే కాదు.. ఇతరుల దాంపత్య జీవితాల్లో తలెత్తే వివాదాలపై కూడా ఆమె కౌన్సిలింగ్‌ ఇస్తుంటారు.

గ్లోబల్‌ ఎయిడ్‌
తనలాంటి వారి కోసం ఏదైనా చేయాలనే తపనతో అమెరికా వెళ్లి అధ్యయనం చేశారు. పదేళ్ల కిందట గ్లోబల్‌ ఎయిడ్‌ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. దీని ద్వారా వికలాంగులకు, హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ బాధితులకు విద్య, వైద్య సాయం, వీల్‌చైర్స్‌, కాలిపర్స్‌ పంపిణీ వంటివి చేపడుతున్నారు. గజపతినగరంలో వికలాంగులు, పేదల కోసం వసతిగృహం నడుపుతున్నారు. నిరుద్యోగ వికలాంగులకు ఉద్యోగావకాశాలకు తగిన చేయూతనందిస్తున్నారు. వికలాంగులు స్వయంగా నడపడానికి వీలుగా కార్లకు మోడిఫికేషన్‌ చేయించారు. ఇందుకోసం ఒక నిపుణుడికి పూణేలో శిక్షణ ఇప్పించారు. ఇలా ఇప్పుడు విశాఖపట్నంలో నగరంలో సుమారు వంద మంది వికలాంగులు తమ కార్లను మోడిఫికేషన్‌ చేయించుకుని తామే స్వయంగా నడుపుకోగలుగుతున్నారంటే అదంతా సాయిపద్మ కృషే. ఆమె క్రీడల్లో కూడా వికలాంగులకు ప్రోత్సాహం అందిస్తున్నారు. తాను కూడా పారా షూటింగ్‌ నేర్చుకున్నారు. పారాషూటింగ్‌లో సాయిపద్మ ఉత్తమ ప్రతిభ కనబర్చి బహుమతులు కూడా అందుకున్నారు.

నిరంతర సేవలతో
వికలాంగుల సేవలకు మాత్రమే పరిమితం కాకుండా ఆమె తమ దగ్గరకు వచ్చే పేద, అనాథ పిల్లలను హీల్‌ ఇండియా నడుపుతున్న విద్యాలయానికి పంపుతున్నారు. అక్కడ వారికి కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందుతుంది. కాలిపర్స్‌ని(కృత్రిమ కాళ్ళు) ఇండియాలో అవసరమైన వారికి అందుబాటులోకి తేవాలన్నది ఆమె ప్రయత్నం. దీనిపై అమెరికాలోని డైనమిక్‌ బ్రేసింగ్‌ సొల్యూషన్స్‌తో గ్లోబల్‌ఎయిడ్‌ సంస్థకు ఒప్పందం కుదిరింది. వారే ఇక్కడకు వచ్చి వాటిని తయారు చేసిస్తారు. దీంతో సగం ధరకే వాటిని పొందే వీలుంది. వీటితో చిన్నారుల్లో వైకల్య తీవ్రతను కొంతైనా తగ్గించవచ్చని ఆమె ఆశాభావంతో ఉన్నారు. వికలాంగుల నైపుణ్య అభివృద్ధి కేంద్రాన్ని కూడా అమె నిర్వహిస్తున్నారు. సామాజిక వివక్షకు గురౌతున్న హెచ్‌ఐవి బాధితుల పిల్లలకు ఓ అనాధశరణాలయాన్ని ఏర్పాటు చేసారు. సాయిపద్మ కృషికి ఎన్నో పురస్కారాలు ఎంతోమంది ప్రశంసలు లభిస్తున్నాయి. లయన్స్‌, రోటరీ క్లబ్బుల అత్యున్నత మానవసేవా పురస్కారాలు పొందారామె, అమెరికాలోని జయంతీ ఫౌండేషన్‌ నుంచి వికలాంగులకు అందించే సేవలకు ఉత్తమ పురస్కారాన్ని పొంది తన కృషికి వన్నెతెచ్చారు.



ఉన్నత వ్యక్తిత్వం
సాయిపద్మలా సామాజిక సేవను నిబద్దతతో స్పష్టమైన కార్యాచరణతో చేసేవారు అరుదుగా ఉంటారు. మా ఇద్దరికీ సామాజిక సేవా ధక్పథం ఉంది. అదే మా ఇద్దర్నీ కలిపింది. దాంతో ఈజీవితం సమాజసేవకే అన్న భావన మరింత బలపడింది.
-ప్రజ్ఞానంద్‌, సాయిపద్మ భర్త




లక్ష్యమే నడిపిస్తోంది
మార్పు మననుంచే ముందు మొదలుకావాలి. ఇల్లు అందుకు తొలివేదికగా నిలవాలి. అందుకే మా ఇంటిని వికలాంగులకు సౌకర్యంగా ఉండేలా తీర్చిదిద్దాను. వికలాంగుల ఆలోచనా దృక్పధాన్ని మార్చి వారు తమ అవకాశాలను మెరుగుపర్చుకునేలా ఉపాధికల్పించడమే మా లక్ష్యం.
-సాయిపద్మ

- బెందాళం క్రిష్ణారావు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి